Title Picture
బి.సరోజాదేవి, ఎన్.టి.రామారావు

ఈ చిత్రం ఆర్థికంగా అఖండ విజయం సాధించడమంటూ జరిగితే అందుకు కారణం ముప్పాతికపాళ్ళు ఆత్రేయ గారి కలం చలవేనని చెప్పవలసివస్తుంది. అంతేకాదు, ఆయన కలం ఈ చిత్రంలో విచ్చల విడిగా చిందులు తొక్కిందని కూడా చెప్పక తప్పదు. తెలుగు (సినిమా) తనం ఉట్టిపడే సన్నివేశాలతో, సంభాషణలతో, పాటలు, నృత్యాలు వగైరా హంగులతో ఈ చిత్రం సగటు ప్రయాణా(16 వేల అడుగులు)న్ని అధిగమించింది.

Title Picture

శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ మూసలో తయారయిన 'ఉషాపరిణయం' అను 'బాణాసుర' చిత్రం తెలుగు పౌరాణిక చిత్రాల సగటు స్థాయికి మచ్చుతునక అనదగ్గట్లుగా ఉంది. కడారు నాగభూషణం గారు తమ యావచ్ఛక్తినీ ఈ చిత్రంలో ప్రదర్శించినట్లున్నారు.

Title Picture

ఒక వర్గం వారికి నచ్చేవిధంగా చిత్రం తీస్తే రెండవ వర్గం వారు ఈసడిస్తారు కనుక పక్షపాతం లేకుండా, తెలుగు ప్రేక్షకుల సగటు సంస్కారాన్ని, విజ్ఞానాన్ని, అభిరుచిని అంచనాకట్టి అందుకు అనుగుణమైన హంగులనూ, హంగామాలనూ ఏర్చికూర్చి 'వెలుగు నీడలు' చిత్రాన్ని నిర్మించారు అన్నపూర్ణావారు. సగటు ప్రేక్షకునికి అంగుళం మేర అయినా విసుగుపుట్టకుండా, కొన్ని సందర్భాలలో 'శెభాష్' అని ఈలకొట్టేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో ఉత్తమ చిత్రాలుగా మనం లెక్కవేస్తున్న వాటి కోవలోకి వస్తుంది 'వెలుగు నీడలు' చిత్రం.

Title Picture
ఎం.జి.ఆర్, పద్మిని

ఒక రాజుగారికి పబ్లిక్ గా ఒకరాణి, ప్రైవేటుగా మరొక రాణి ఉంటారు. మొదటి ఆవిడ హిందూస్త్రీ, పట్టమహిషి. రెండో ఆవిడ ముస్లిం స్త్రీ. ఇద్దరూ చెరొక మగపిల్లాణ్ణి కంటారు. ముస్లిం ఆవిడకి కొంచెం ముందు పుడతాడు. అతని పేరు దావూద్ ఖాన్. పట్టమనిషి కొడుకు పేరు దేసింగు. రాజుగారు ముస్లిం భార్యను, బిడ్డతోసహా దొడ్డిదారిని ఆడవికి పంపేస్తాడు. దేసింగు, దావూద్ పెరిగిపెద్దవారై యం.జి. రామచంద్రన్ అంతటి పరాక్రమవంతులవుతారు. అనేక పాటలు, యుద్ధాలు, కుట్రలతో కథ బోలెడు గడిచిన తర్వాత దావూద్ జన్మరహస్యం తెలుస్తుంది. తమ్ముడి మీద పగబడతాడు. దేసింగును చంపననీ, అతనికి తను అన్నననే విషయం చెప్పననీ ఒట్టు వేయించుకుని దావూద్ తల్లి చనిపోతుంది. అక్కడ రాజుగారు కూడా కాలం చేయడంతో దేసింగు రాజు అవుతాడు. తన స్థానాన్ని ఆక్రమించుకొన్న తమ్ముణ్ణి జయించడానికి దావూద్ బయలుదేరుతాడు. చివరికి క్లయిమాక్సు లాగా ఘోరమైన యుద్ధం జరిగి దావూద్ చనిపోతాడు. కయ్యాలు అన్నిటికీ కారకుడైన దమనకుడు వచ్చి 'దావూద్ నీ అన్నే సుమా' అని చెప్పి, దేసింగు చేత కత్తి పోటు తిని మరణిస్తాడు. భరతమాతను, రాజ్యాన్ని, చనిపోయిన సైనికులనూ, ప్రేక్షకులను, ఉద్దేశించి బారెడు స్వగతోపన్యాసం చేసి తను కూడా పొడుచుకుని చనిపోతాడు దేసింగు.

Title Picture
జగ్గయ్య, సావిత్రి

సగటు కంటే తక్కువ నిడివిలో ఈ చిత్రాన్ని ముగించినందుకు దర్శకుని అభినందించక తప్పదు (నిడివి-13,900 మాత్రమే). అయితే ఈ చిత్రాన్ని ఇంకా పొట్టిగా నిర్మించడానికి అవకాశం ఉన్నదనిపిస్తుంది. చిత్రాల నిడివిని తగ్గించితే తెలుగు చిత్రాలకు కొత్తగా వచ్చే అవలక్షణమేమీ ఉండదని ఈ చిత్రం నిరూపిస్తుంది.

Title Picture

తెలుగులో డబ్బింగు చిత్రాల తయారీ లాభసాటి కుటీర పరిశ్రమగా, చిన్న మొత్తాల పొదుపు పథకంగా దినదిన ప్రవర్థమానమవుతున్నది. లక్షలకు లక్షలు వెచ్చించి నిర్మించే చిత్రాలు పట్టుమని పదివారాలైనా మార్కెట్టులో విహరించకమునుపే గూటికి చేరుకొంటున్నాయి. అందుకే మన నిర్మాతలు ఈ అడ్డదారిని ఆశ్రయించారు. ఈ సంవత్సరం ఇంతవరకు 45 చిత్రాలు విడుదలైనాయి. వీటిలో 17 డబ్బింగు చిత్రాలు; ఐదు చిత్రాలు మాత్రం ఇంతవరకు వందరోజులు నడిచాయి. డబ్బింగు చిత్రాలలో రెండు రకాలు ముఖ్యంగా కనుపిస్తున్నాయి. తమిళం నుంచి అనువదించినవి, హిందీ నుంచి అనువదించినవి. కన్నడ చిత్రాలను కూడా అనువదించడం జరుగుతున్నది కాని చాలా అరుదు. అరవ డబ్బింగు చిత్రాల థోరణికీ, హిందీ డబ్బింగు చిత్రాల ధోరణికీ చాలా వ్యత్యాసం ఉంటున్నది. భాషలో ఎంతో వ్యత్యాసం కనుపిస్తున్నది. అరవ చిత్రాల కంటె, హిందీ చిత్రాలనే మన ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నట్లు తోస్తుంది.

Title Picture

జోహార్ నిర్మించిన 'బేవకూఫ్' (పరమశుంఠ) చిత్రం నవరస భరితంగా ఉంది. హాస్యరసం మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుందన్న సంగతి ఈ చిత్రం పేరు చూస్తేనే స్ఫురిస్తుంది. ఏ రసమైనా వికటించినప్పుడు జుగుప్సగా తయారవుతుంది. అట్టి జుగుప్స మన ప్రేక్షకులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కిటుకు జోహార్ కు తెలుసు. అతని చిత్రాలన్నీ ఆర్థికంగా నూటికి నూరు పాళ్ళు విజయవంతమవుతున్నాయి. మెజారిటీ జనరంజకంగా ఉంటున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాన్ని అక్షరాలా పాటిస్తున్న చాలమంది సినిమా దర్శకులలో జోహార్ ఒకడు. ఎన్నికలు పెడితే జనం కళ్ళు మూసుకుని అతనికే వోటు వేస్తారు.

Title Picture
కుంకుం, చంద్రశేఖర్

'స్త్రీలలో పాతివ్రత్యం ఉండాలిగానీ, ఈ కాలంలోనైనా భర్తలను చావు నుంచి తప్పించవచ్చును' అని నిరూపించటానికి ప్రయత్నిస్తుంది ఈ చిత్రం. ఈ చిత్రం పేరు చూస్తేనే ఇది పాములకు సంబంధించిన కథ అని ఇట్టే పసికట్టవచ్చు. అంతేకాదు, సాంకేతిక వర్గం, తారాగణం చూసి ఈ చిత్రం ఎంత బాగుంటుందో కూడా తేలిగ్గానే అంచనా వెయ్యవచ్చును. పండిత పామర విచక్షణ లేకుండా ఎవరు ఎలా ఉంటుందని వెళ్తారో సరిగ్గా అలాగే ఉంటుంది ఈ చిత్రం. సారాంశమేమంటే, ఈ చిత్రం ఏవర్గంవారికీ ఆశాభంగం కల్గించదు.