నజీర్ హుస్సేన్ ఫిలింస్ నిర్మించిన శృంగార, హాస్య ప్రధాన చిత్రం ''జబ్ ప్యార్ కిసీసే హోతాహై'' పత్రికా విమర్శకుల దృష్టిలో కాకపోయినా బాక్సాఫీసర్ల దృష్టిలోనూ, వినోదార్థుల దృష్టిలోనూ అత్యుత్తమ చిత్రం అనడంలో సందేహం లేదు. చలన చిత్రాలలో నూటికి నూరు పాళ్ళూ వినోదం అనబడేదాన్ని చొప్పించడం నజీర్ హుస్సేన్ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు.
పాఠకుల విషయం అంత రూఢిగా చెప్పలేము కాని, పాఠకులు కానివారికి ఈ చిత్రం షడ్రసోపేతమైన భోజనం సుష్టుగా తిన్నంత తృప్తినిస్తుంది. తీరుబడిగా మూడు గంటలసేపు కమ్మగా చూసి, తృప్తిగా, ఆయాసంగా బయటకు వస్తారు. తర్వాత చాలా కాలం నెమరువేసుకుంటారు. పండిత ప్రేక్షకులనబడే అల్పసంఖ్యాకులకు యీ చిత్రం తిండిపుష్టి లేని వారికి పెళ్ళి భోజనం వలె అనిపించవచ్చును.
నూటికి నూరు పాళ్లూ ఈ చిత్రం యువజన మనోరంజకంగా తయారైంది. కళా ప్రమాణాలను గురించి, నైతిక విలువలను గురించి, ఆట్టే పట్టింపులేని వారికి, కాలక్షేపమే ప్రధానమైనవారికి ఇది అమృతోసమానమైన చిత్రం. దర్శక, నిర్మాతల సంకల్పం పూర్తిగా సిద్ధించింది. ఎందుకంటే వారు చెప్పదలచుకున్నది ఏదైనా సూటిగా వేగంగా, చచ్చులేకుండా చెప్పగలిగారు.
అశోక్ పిక్చర్స్ వారి తాజా చిత్రం కల్పన లోగడ అశోక్ కుమార్ నిర్మించిన 'రాగిణి'తో సరితూగేవిధఁగా ఉంది. ఆ చిత్రాన్ని చూసినవారు ఈ చిత్రం ఎంత బాగుంటుందో ఉజ్ఞాయింపుగా ఊహించుకోవచ్చును. అయితే, ఆ చిత్రం కంటే ఈ చిత్రానికి ప్రచారం ఎక్కువ జరిగింది కనుక జనం కొండంత ఆశలు పెంచుకున్నారు. వారికి ఈ చిత్రం ఆశాభంగం కలిగిస్తుందనడం సాహసమే అవుతుంది. మన మెజారిటీ ప్రేక్షకులకు ఈ చిత్రం పాత చొక్కా తొడుక్కున్నంత సుఖంగా ఉంటుంది.
అనగనగా ఒక ఊళ్లో కాంతం అనే పదహారేళ్ల పల్లె పడుచు అయస్కాంతంలా వయసు మీరిన వారిని సైతం ఆకర్షిస్తూ ఉంటుంది. పోకిరీరాయుళ్ళెవరూ ఆమె మీద కన్నూ, చెయ్యీ వేయకుండా అంగరక్షకుడుగా కాపాడుతుంటాడు వాళ్ళ అన్నయ్య రాజు. అతను జానకిరామయ్య అనే ముసలి జమిందారు దగ్గర పాలికావు. జమిందారు కూతురు శారద పట్నం నుంచి చదువు ముగించుకుని వచ్చిందే తడవుగా రాజును ప్రేమించటం ప్రారంభిస్తుంది. తన కూతురుని పచ్చగన్నేరుపాలెం బుచ్చిబాబుకు ఇచ్చి, పెళ్ళి చేయాలని జానకిరామయ్య గారి సంకల్పం. ఆ ఊళ్లో 'అగ్గిపిడుగు జగ్గడు' అనే అతి భయంకరుడైన రాక్షసుడొకడు సపరివారంగా కాపురమున్నాడు. 'నరవాసన' అంటూ అతను దాడి ప్రారంభించగానే ప్రజలు ఎక్కడి వాళ్ళక్కడ పారిపోయి ప్రాణాలు దక్కించుకునే వారు.
నేటి నవనాగరిక ప్రపంచంలో యువతీ యువకుల మధుర స్వప్నాలకు ప్రతిబింబం 'లవ్ ఇన్ సిమ్లా'. స్వాప్నిక ప్రపంచంలోవలెనే ఈ చిత్రంలో కూడా వాస్తవికతకు తావులేదు. అయితే కల మధురంగా ఉంటే వాస్తవికత ప్రశ్నరాదు. తియ్యటి కలల్ని మళ్ళీ మళ్ళీ నెమరువేసుకున్నట్లే ఎన్ని సార్లు చూసినా తనివితీరని చిత్రం 'లవ్ ఇన్ సిమ్లా'. యువ ప్రేక్షకులపై ఎస్. ముఖర్జీ గారి తాజా సమ్మోహనాస్త్రం ఇది.
పోషించే తాహతు లేనప్పుడు 'ఒకరి తర్వాత ఒకరు'గా అదే పనిగా సంతానాన్ని ఉత్పత్తి చేయటం చాలా ప్రమాదమనీ, పిల్లలకు చదువుసంధ్యలు చెప్పించలేక, బికారుల్లాగా దేశం మీదికి వదిలి, చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవలసిన గతి పడుతుందనీ, అందుకే బుద్ధిగా ప్రభుత్వం చెప్పినట్లు కుటుంబ నియంత్రణాన్ని అమలు జరిపి, భూభారాన్ని తగ్గించాలనీ ప్రబోధించటం ఈ చిత్రం ఉద్దేశ్యం. ఉద్దేశ్యం చాలా చక్కనిదే. మిగతా సంపదలమాట ఎలా ఉన్నా, జనాభా ఉత్పత్తి విషయంలో మాత్రం మిగతా దేశాలన్నింటినీ ఓడించి ప్రథమ స్థానం అలంకరించటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మన దేశంలో ఇటువంటి చిత్రాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ప్రయోజనాత్మక చిత్రం అనే పేరిట ప్రేక్షకులను విసిగించాలని కుట్రపన్నితే సహించబోరని మాత్రం నిర్మాతలందరూ గుర్తుంచుకోవాలి.